Thursday 1 January 2015

మహనీయుడు మనిష

0 comments

షడ్ దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా!
నిద్రా తంద్రా భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రతా॥

మనుషులంతా ఉన్నతంగా బతకాలనీ కోరుకుంటారు. అయితే అభ్యున్నతిని కోరేవారు ముఖ్యంగా ఆరు దోషాలను విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతుంది. నిద్ర, బద్ధకం, భయం, కోపం, అలసత్వం దీర్ఘసూత్రత (ఎటు తెగని ఆలోచన) ఈ ఆరు దోషాలను మనుషులు తమ తమ ఆధీనంలో ఉంచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా వీటిని జయించి కలలను సాకారం చేసుకునే దిశగా జీవితాన్ని సఫలం చేసుకోవాలి.
జీవన పయనంలో ఎత్తుపల్లాలూ, ఆటుపోట్లూ తప్పవు. పరిస్థితులు అందించే అనుకోని అనుభవాలు ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, ఎంతటివారైనా కుంగిపోతారు. నిరాశా నిస్పృహలు అలుముకొని ముభావంగా మా జీవితమే ఇంతని గడుపుతుంటారు. తనకు మించి తాను ఉన్నతంగా లేని మానవుడు హీనస్థితికి చేరుకుంటాడన్న మహానుభావుల అనుభవసారం గుర్తుచేసుకుంటూ ఆశాపూరిత భావాలతో కృషి చేయాలి.

ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మాన మీవ సాదయేత్‌
ఆత్తైవహి ఆత్మనోబంధుః ఆత్తెవరిపురాత్మనః॥


మానవుడు తనను తానే ప్రోత్సహించుకోవాలి. ఉద్ధరించుకోవాలి. ఎన్నడూ నిరుత్సాహానికి తావివ్వకూడదు. ఎందుకంటే మనిషికి మనిషే మిత్రుడూ, శత్రువు. నేను అనే ఉన్నత భావన మనః సంకల్పాన్ని దృఢపరచి అఖండ విజయాలకు ప్రతీకయై నిలుస్తుంది. నేనింతే అనే నిరాశ బలోపేతమై అడుగడుగునా నిరుత్సాహపరుస్తూ హీనదశకు చేరుకునేలా చేస్తుంది.
మనలోనే ఉన్న అనంత తత్తాన్నీ, అఖండ విశ్వాసాన్ని గ్రహించగలిగితే, అనంతమే మన నిజ తత్తమనీ, మన సంకల్పానికి ఆకాశమే హద్దనీ గుర్తించగలిగితే అద్భుతమైన శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. మానవ జీవిత లక్ష్యం మనస్సులో దృఢపడే విశ్వాసంతో సాధ్యపడుతుంది. అత్యున్నత ఆలోచనలతో సాకారం అవుతుంది. చరిత్రలో జరిగిన జరుగుతున్న జరగబోయే సాఫల్యాకూ, విజయాలకూ, అద్భుతాలకూ, ఆనందాలకూ మానవులే మూలకారణం.
-ఇట్టేడు అర్కనందనాదేవి --

0 comments:

Post a Comment